Home » “అర్ధనారీశ్వరుడు” శివునికి ఆపేరు ఎలా వచ్చిందో తెలుసుకోండి.

“అర్ధనారీశ్వరుడు” శివునికి ఆపేరు ఎలా వచ్చిందో తెలుసుకోండి.

by Lakshmi Guradasi
289 views
Story behind Ardhanarishwar form of shiva

పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది. తలనుండి కాలి బొటన వేలివరకూ సమానముగా అంటే నిలువుగా చెరి సగముగా ఉన్న మగ, ఆడరూపాలు ఒకటిగా ఉండడము. అర్ధ (సగమైన ) నారి (స్త్రీ), ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది. తల ఆలోచనకి, పాదము ఆచరణికి సంకేతాలైతే, పార్వతీ పరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట. లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా … ఆచరణలోనూ, ఆలోచనలోనూ కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలో నూ, నిర్మాణాలలోనూ ఒకటిగా చెరిసగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది. పరమేశ్వరుని, అంబికను ఏకభావముతో, భక్తితో సేవించాలి. అప్పుడే అధిక శుభము కలుగుతుంది. ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న … ఆ ఇరువురియందు మాతాపితృ భావము ఉండాలి.

అర్ధనారీశ్వరుడు

లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే… పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి… కలిసి పనిచేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం.

ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ)గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ)గా పండితులు చెబుతారు. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం.
అర్ధనారీశ్వరుడు అవతరించినది మాఘ బహుళచతుర్ధశి రోజైన మహాశివరాత్రి నాడు.

ఆది దంపతులు – జగత్పితరులు

‘జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’ అని స్తుతిస్తుంటారు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు ఆ పార్వతీపరమేశ్వరులు. ఈ ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కన్పించటం కూడా అందరికీ తెలిసిందే.

ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటీ? అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథా సందర్భం.

ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కన్పిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతించిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు.

బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు.

అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగనాత్మను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది.

ఆ వెంటనే భవానీదేవి కనుబొమల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది.

సృష్టి ఆవిర్భావం స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది. స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని, ప్రతివారు స్త్రీ మూర్తులను గౌరవించి తీరాలని ఆదిదేవుడు, ఆదిపరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథా సందర్భం వివరిస్తుంది.

అంతేకాక స్థితి, లయ కారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేక పోయిందని, పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తోంది.

స్త్రీ శక్తి విశిష్టతను తెలియచెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు. కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ, స్త్రీలను, స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రం దైవహితం కాదనే విషయాన్ని ఈ కథలో మనం గమనించవచ్చు.

లోకం లో సహజం గా వినిపించే మాట పురుషుడే అధికుడని . శంకరుని విషయములో అది సరికాదు. శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరము గౌరవిస్తూనే ఉంటాడు. పార్వతితో తనకు వివాహము కాకముందు తానే స్వయముగా మారు రూపములో ఓ బ్రహ్మచారి వేషములో ఆమె వద్దకు వెళ్ళి — శంకరునికి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదని బూడిద మాత్రమే ఒంటికి పూసుకుంటాడని, ఇల్లు లేని కారణముగా స్మశానములోనే ఉంటాడని, నిత్యము బిక్షకోసము తిరుగుతూ ఉంటాడని, బిక్షపాత్రకూడా లేని కారణముగా పర్రెని బిక్షపాత్రగా ధరిస్తాడని … ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకే ఒక్క ప్రియుడు శంకరుడు. లోకములో ప్రేముకులందరికీ ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా.

తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరము ఆమె వద్దకు వెళ్ళి భిక్ష యాచిస్తాడు శంకరుడు .

ఆయన చేతిలో పుర్రె మన తలమీది పైభాగానికి సాంకేతం, ఆమె పెట్టే అన్నము జ్ఞానానికి సంకేతము కాబట్టి ఆయన ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేది ” జ్ఞాన (అన్న) భిక్ష ” తప్ప మనలా అన్నము మాత్రము కానేకాదు.

అందుకే, ” అన్నపూర్ణే ! సదాపూర్ణే ! శంకర ప్రాణ వల్లభే ! జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి !”. అంటుంది శ్లోకము.

ఓం నమః శివాయ! ఓం శ్రీ మాత్రే నమః !

See Also plz click on this: hanuman-tail-bell-significance

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ పురాణాలు ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.