Home » కాంతారా పంజుర్లి–గులిగ: తులునాడు భూతకోల సంప్రదాయం & అసలు చరిత్ర

కాంతారా పంజుర్లి–గులిగ: తులునాడు భూతకోల సంప్రదాయం & అసలు చరిత్ర

by Lakshmi Guradasi
694 views
Kantara Panjurli Guliga history explained

తులనాడు చరిత్ర, సంస్కృతిలో పంజుర్లి మరియు గులిగా దైవాల కథలు, వాటి ప్రాముఖ్యత ఈ విధంగా ఉన్నాయి:

శివగణాలు, తులనాడు భూమి నేపథ్యం:

శివగణాలు అంటే శివుడికి ఎంతో ఇష్టమైన భక్తులు, శివునికి, ఆయన గణాలకు అసలు తేడా లేదు. భూమిపై దుర్మార్గం పరాకాష్టకు చేరుకున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి వారు భూమిపై అవతరిస్తారు. శివగణాలలో పంజుర్లి, గులిగా కూడా ముఖ్యమైనవారు. వీరు శివుడి వరం వల్ల భూతగణాలుగా భూమిపైకి వచ్చి ప్రజలను, ప్రకృతిని రక్షిస్తుంటారు. తులునాడు భూమి శివుడికి ఎంతో ప్రియ విద్యార్థి అయిన పరశురాముడి వల్ల ఏర్పడిన మహా పుణ్యభూమి. ఈ ప్రాంతాన్ని పరశురామ క్షేత్రం అని కూడా పిలుస్తారు. పూర్వం ఈ ప్రాంతం సముద్రం లోపల ఉండేది. త్రేతా యుగంలో పరశురాముడు క్షత్రియులను చంపి భూమికి విముక్తి కలిగించిన తరువాత, తను గెలిచిన భూమి మొత్తం బ్రాహ్మణులకు దానం చేస్తాడు. భూమి తక్కువ వచ్చినప్పుడు, ఆయన సముద్రుడిని కొంత భూమిని ఇవ్వమని కోరగా, ఇప్పుడు ఆ ప్రాంతం అంతా తులునాడుగా మారింది.

పంజుర్లి దైవం (భూవరాహ స్వామి) కథ:

పంజుర్లి దైవాన్ని స్వయంగా భూవరాహ స్వామి అవతారంగా కొలుస్తారు. తులునాడులోని జానపద గ్రంథాల ప్రకారం, పంజుర్లి దేవుడు కైలాసంలో అడవిలో పుట్టాడు, ఆయన్ని పార్వతీ మాత ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉండేది. యుక్త వయసు వచ్చాక, పంజుర్లి కైలాసంలోని చెట్లను, ప్రకృతిని పాడు చేస్తుంటే, పరమశివుడు ఆగ్రహిస్తారు. అప్పుడు పార్వతీదేవి జోక్యం చేసుకుని, ఆ లక్షణం ప్రకృతి తనకు ఇచ్చిందని వివరిస్తుంది. శివుడు శాంతించి, పంజుర్లని పంటలకి, ప్రకృతికి, పంచభూతాలకు రక్షకుడిగా ఉండమని వరం ఇస్తాడు. అప్పటి నుండి ఇప్పటికీ ఆయన తులునాడులోని అందరిని రక్షిస్తూనే ఉన్నారు. పంజుర్లి శాంత స్వరూపం కాబట్టి, ఆయనకు సాత్వికమైన పళ్ళు, పాలు, పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తారు. భూతకోల సమయంలో, నెలికే అనే తెగకు సంబంధించిన ఒక పూజారిలోకి పంజుర్లి దైవం వస్తారని నమ్మి, అన్ని కులాలు, అన్ని మతాలు వారు కలిసి ఆయన్ని ఆరాధిస్తారు. దైవం కొడవలి (ఖడ్గంతో) ఒక గీత గీసి, “ఈ భూమి, ఈ ప్రజలు, ఈ గాలి అన్నిటికీ నేనే రక్షకుడిని” అని పెద్దగా అరుపు అరుస్తాడు.

గులిగా దైవం: క్రోధ రూపంలో న్యాయం

గులిగా దైవం తులునాడులో సామాన్యమైన దేవుడు కాదు; ఈయన ధర్మాన్ని ఇప్పటికీ అతి క్రోధ రూపంలో రక్షిస్తున్న దైవిక శక్తి. గులిగ అంటే కన్నడలో ‘రాయి’ అని అర్థం. కైలాసంలో అమ్మవారు ఈశ్వరుడి కోసం భస్మాన్ని తీసుకువస్తే, అందులో ఒక చిన్న రాయి ఉంటుంది. శంకరుడు ఆ రాయిని వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు చేతి స్పర్శతో ప్రాణం పోయించి, తనని న్యాయానికి, ధర్మానికి ఆది దైవంగా ఉండమని వరమిస్తాడు. వరం పొందిన వెంటనే గులిగా కడుపులో భయంకరంగా ఆకలి పుడుతుంది. ప్రపంచంలోని ధాన్యం, నీళ్లు, చెట్లను అన్నిటిని తినేసినా ఆకలి తీరదు, చివరికి శ్రీ మహావిష్ణువు తన చిటికెన వేలిని కూడా ఇచ్చేస్తాడు, అప్పుడు తన ఆకలి తీరుతుంది. గులిగా దైవం తప్పు చేసిన వారికి భైరవుడి లాగా, యమధర్మరాజు లాగా, నీతిగా బ్రతికే వారికి పరమ దయ స్వరూపంగా ఉంటారు. గులిగా దైవానికి కోపం వస్తే భయంకరమైన కరువు, రోగాలు, వరదలు వస్తాయని ప్రజల నమ్మకం.

గులిగా దైవం యొక్క తీర్పులు (కంబోల రాజ్యం):

గులిగా దైవం దగ్గర ఎవ్వరు నిజం దాయలేరు. భూతకోల జరిగే సమయంలో, ఎవరైనా తప్పుడు పనులు చేసినా, అన్యాయం చేసినా, బలహీనులను బాధ పెట్టినా ఆయన వెంటనే అక్కడే శిక్ష వేస్తాడు. దైవానికి ఎదురు తిరిగి తప్పుడు పనులు చేసిన ఎంతో మంది నవరంద్రాల నుంచి రక్తం కక్కుకొని చనిపోతారు; ఇది ఎన్నో సార్లు నిజంగా జరిగింది. కంబోల రాజ్యాన్ని పాలించే రాజు అమాయకులైన అడవి ప్రజలకు భూమి ఇస్తానని చెప్పి, వారి వృక్ష సంపదను, అపారమైన రత్నాలను దోచుకోవాలని మోసం చేస్తారు. ఆ తర్వాత 11 రోజులకే ఆ రాజు విచిత్రమైన వ్యాధితో రక్తం కక్కుకొని చనిపోయాడు. ఆ మోసంలో భాగమైన ప్రతి ఒక్కరు ఆ సంవత్సరంలోనే విచిత్రమైన వ్యాధులతో సోకి చనిపోయారు. ఎంతో మంది రాజులు, అధికారులు, న్యాయవాదులు తప్పుడు పని చేసినందుకు గులిగా కోపానికి బలి అయ్యారు. గులిగా దైవంలోకి వచ్చిన పూజారి అతి ఘోరంగా ఎగురుతూ, అరుస్తూ, జంతువుల పచ్చి రక్తాన్ని, మాంసాన్ని ఆహారంగా నివేదన చేస్తారు.

భూతకోల సంప్రదాయం:

భూతకోల అనేది భారత భూమి మీద వేల సంవత్సరాలు గడిచినా ఇంకా జీవం నిలిచి ఉన్న ఒక అద్భుతమైన సంప్రదాయం. ఇది కేవలం పూజ కాదు; ఇది మనిషి మరియు దేవుడి మధ్య ఉన్న జీవ సంబంధం. ప్రతి సంవత్సరం ఆ దేవుడే పూజారి రూపంలోకి ఆవహించి, ప్రజల సమస్యలపై తీర్పు చెబుతారు. దైవం శరీరంలోకి ప్రవేశించడానికి సంకేతంగా, మనిషి శరీరం తీవ్రంగా వనకడం, కదలడం మొదలవుతుంది. ఆ వ్యక్తి యొక్క ముఖ కవళికలు పూర్తిగా మారిపోయి, క్రోధంతో కూడిన చూపు, గంభీరమైన రూపం కనిపిస్తుంది. డప్పులు, ఇతర సంగీతం లయ పెరిగే కొద్దీ, ఆ వ్యక్తి అత్యంత వేగంగా, శక్తివంతంగా మరియు భీకరంగా నృత్యం చేస్తాడు. ఈ నృత్యం గంటలు తరబడి తెల్లవారు జామున వరకు కొనసాగినా, ఆ వ్యక్తి అలసట లేకుండా ప్రదర్శిస్తాడు. పూనకం వచ్చిన వ్యక్తి మంటలని తినడం లేదా మండుతున్న దివిటీలను చాతిపై ఉంచుకోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తారు. దైవం మాట్లాడుతుంటే, ప్రతి మనసు తలవంచుతుంది; రాజు, పేద అనే తేడా లేదు, దైవం ముందర అందరూ సమానమే. ఇది న్యాయం చెప్పే దేవుడు, ప్రకృతి రక్షకుడు, మన ఆత్మకి అర్థం చూపే శక్తి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ చరిత్ర ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.