తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రం దర్శించుకోవడమనేది ఒక పవిత్ర యాత్ర, ఓ ఆధ్యాత్మిక పునీత. కాబట్టి అటువంటి కొండమీదకు చేరుకొని పరంధాముడని దర్శించుకోవాలంటే ఎన్నో పవిత్రమైన మెట్లను ఎక్కవలసి ఉంటుంది. ఈ యాత్రలో ప్రతి మెట్టు, ప్రతి అడుగు భగవంతుని సన్నిధిలో పడే దివ్య క్షణమే.
పురాణాలు చెబుతున్నట్లుగా తిరుమల కొండ స్వయంగా శాలిగ్రామ మయమైన భగవంతుని రూపం. ఇక్కడి ప్రతి చెట్టు, ప్రతి రాయిసాక్షాత్తు పరమాత్ముని స్వరూపం.
ఇలాంటి దివ్య భూమిపై మనం అడుగుపెడుతున్నాం అంటే మనకు తెలియకపోయినా, ఇది దేవుని దేహం మీద అడుగు మోపడమే అని భావించాలి. సాధారణంగా దేవుని విగ్రహానికో లేదా మరొక దానికో మన కాళ్ళు అనుకోకుండా తగిలితేనే మనం వెంటనే క్షమాపణ కోరుతాం. మరి ఆయన రూపమే అయిన తిరుమల కొండపై కాళ్ళు మోపుతున్నప్పుడు మరి మనం ఏమి చేయాలి?
పూర్వం రామానుజులు వారు , తిరుమల యాత్రలో కొండమీద అడుగుపెట్టడం తప్పు అనే భావనతో, మోకాళ్లపై నడిచి స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఇది సాధారణ భక్తులకు సాధ్యం కానిది. కాబట్టి మనలాంటి సాధారణ వారికి ముందుగానే క్షమాపణ కోరుతూ ఆ భక్తి భావనను వ్యక్తపరచేందుకు పురాణాలు కొన్ని శ్లోకాలను సూచిస్తున్నాయి. వీటిని మన యాత్ర మొదలు పెట్టే ముందు అలిపిరి వద్దో లేదా శ్రీవారి మెట్ల వద్దో ఒకసారి స్మరించుకుని ప్రయాణం మొదలు పెడితే ఆ దోషం అంతటితో పోతుందని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఇప్పుడు ఆ శ్లోకాలు ఏంటో వాటి అర్ధమేంటో తెలుసుకుందాం.
శ్లోకాలు
బ్రహ్మాదయోపి యం దేవాః సేవంతే శ్రధ్ధయా సహ
తం భవంతమహం పద్భ్యాం ఆక్రమేయం నగోత్తమ
క్షమస్వ తదఘం మేద్య దయయా పాపచేతసః
తన్ మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వ మే
ప్రార్ధయిత్వా నరస్త్వేవం వేంకటాద్రిం నగోత్తమం
తతో మృదుపదం గఛ్ఛేత్ పావనం వేంకటాచలం
అర్ధం
“ఓ వేంకటాచలమా నువ్వు చాల పవిత్రమైన కొండవి, నిన్ను బ్రహ్మాదులందరూ సేవిస్తుంటారు. అటువంటి నీపైన ఇప్పుడు నేను పాదం మోపవలసి వస్తుంది, నీ మీద కాలు మోపి పాపాన్నీ చేస్తున్న నన్ను క్షమించు. నీ శిరస్సు మీద మాధవుడిని తీసుకొచ్చి పెట్టుకున్నావు, అయన దర్శనం చేసుకోవాలంటే కొండ ఎక్కాలి కదా అందుకని పాదాలతో కొండ ఏక్కుతున్నాను, అందువల్ల నా పాదం నీ మీద మోపవలసి వస్తుంది. అంతేకాని అహంకారంతో కాదు నన్ను క్షమించు, నా యాత్రను సఫలం చేయి ” అని అర్ధం.
👉ఇంకా ఇటువంటి వాటి కోసం తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి