Ganagapur Dattatreya Temple – History, Significance, and Places to Visit
కర్ణాటకలోని గానగాపూర్ అనే చిన్న గ్రామం… బయటకు చూస్తే అది సాధారణంగా కనిపించవచ్చు, కానీ భక్తుల హృదయాల్లో ఇది అపార విశ్వాసానికి చిరునామా. ఇది కేవలం దత్తాత్రేయుని ఆలయం మాత్రమే కాదు – అది శ్రీ నృసింహ సరస్వతి స్వామి అడుగులు పడిన భూమి. ఆయన సాక్షాత్కారమైన జీవితం ఇక్కడే గడిచిందనేది భక్తుల నమ్మకం. ఆ మహాత్ముడి స్పర్శ పడ్డ ఈ మట్టిలో ఏదో అనుకోలేని శక్తి ఉందని, ఆయన ఆశీస్సులు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడినీ తాకుతాయని వారు నమ్ముతారు.
ఇక్కడకు వచ్చే భక్తుల్లో కొందరు కేవలం స్వామివారి దర్శనం కోసం వస్తే, మరికొందరు తమ బాధలు చెప్పుకొని ఉపశమనం పొందడానికి వస్తారు. ముఖ్యంగా, దయ్యాల పట్టింపులు, మానసిక కలతలు, తీవ్రమైన భయాలు వంటి సమస్యలతో సతమతమయ్యే వారికి ఇది ఒక గొప్ప ఆదరణ క్షేత్రం. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అయితే, ఇలాంటి సమస్యలతో బాధపడే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు చేరుకొని, స్వామివారి పాదాల చెంత తమ కష్టాలు తీరాలని ప్రార్థిస్తారు. గానగాపూర్ కేవలం ఒక ఆలయం కాదు – అది ఎంతోమందికి ఒక ఆశ, ఒక ఆశ్రయం.
గానగాపూర్ ఎలా చేరుకోవాలి? (ప్రయాణ మార్గాలు):
మన తెలుగు రాష్ట్రాల నుంచి గానగాపూర్ చేరుకోవడం చాలా సులభం. గానగాపూర్ సమీపంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్లు రెండు: గానగాపూర్ రోడ్ స్టేషన్ మరియు గుల్బర్గా (కాలాబుర్గి) రైల్వే స్టేషన్.
రైలు ద్వారా:
గానగాపూర్ రోడ్ స్టేషన్: ఈ స్టేషన్ గానగాపూర్ క్షేత్రానికి అతి సమీపంలో, సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి వంటి మన తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల నుంచి గానగాపూర్ రోడ్ స్టేషన్ కు నేరుగా రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
గుల్బర్గా (కాలాబుర్గి) స్టేషన్: ఒకవేళ మీకు గానగాపూర్ రోడ్ స్టేషన్ కు రిజర్వేషన్ లభించకపోతే, గుల్బర్గా (ప్రస్తుతం కాలాబుర్గి) రైల్వే స్టేషన్ కు అనేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కాలాబుర్గి నుంచి గానగాపూర్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
రైల్వే స్టేషన్ నుంచి గానగాపూర్ కు ప్రయాణం:
గానగాపూర్ రోడ్ స్టేషన్ నుంచి: ఇక్కడ దిగగానే బస్సులు మరియు షేర్ ఆటోలు సులభంగా లభిస్తాయి. నేరుగా ఆటో మాట్లాడుకొని కూడా వెళ్ళవచ్చు, రవాణాకు ఎటువంటి సమస్య ఉండదు.
గుల్బర్గా (కాలాబుర్గి) స్టేషన్ నుంచి: రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కు ఆటోలో (సుమారు 2 కి.మీ, రూ. 40 చార్జ్) చేరుకోవచ్చు. కాలాబుర్గి బస్ స్టాండ్ లో ఏడో నెంబర్ ప్లాట్ఫారం నుంచి గానగాపూర్ కు ప్రతి గంటకు లేదా 45 నిమిషాలకు బస్సులు లభిస్తాయి, టికెట్ ధర సుమారు రూ. 51. ఒకవేళ నేరుగా బస్సు లభించకపోతే, ప్లాట్ఫార్మ్ నెంబర్ ఐదు నుంచి అఫ్జల్పూర్ కు వెళ్లే బస్సులు ఎక్కి, చౌడాపురంలో దిగి, అక్కడి నుంచి మరో బస్సులో లేదా ఆటోలో గానగాపూర్ చేరుకోవచ్చు. చౌడాపురం నుంచి గానగాపూర్ సుమారు 4.5 కిలోమీటర్లు ఉంటుంది.
బస్సు ద్వారా: హైదరాబాద్ నుంచి కూడా గుల్బర్గాకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. గుల్బర్గా నుంచి మరో బస్సులో గానగాపూర్ చేరుకోవచ్చు.
గానగాపూర్ లో వసతి (బస చేసే ప్రదేశాలు):
గానగాపూర్ లో బస్ స్టాండ్ సమీపంలో బస చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
హోటల్స్ మరియు హోమ్ స్టేస్: బస్ స్టాండ్ కు ఎదురుగా ఉన్న వీధిలో మరియు దాని చుట్టూ అనేక బడ్జెట్ హోటల్స్ మరియు హోమ్ స్టేలు లభిస్తాయి. నాన్ ఏసీ రూమ్లు సుమారు రూ. 600 నుంచి 800 మధ్యలో లభిస్తాయి, అదే ఏసీ రూమ్లు అయితే రూ. 1200 నుంచి 1500 వరకు ఉంటాయి. అయితే, వీటికి ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం ఉండదు, కాబట్టి నాలుగైదు హోటల్స్ చూసి ఎంచుకోవాల్సి ఉంటుంది.
లగ్జరీ హోటల్స్: బస్ స్టాండ్ కు ఎడమ వైపు కొంచెం ముందుకు వెళితే, కొన్ని పెద్ద, లగ్జరీ హోటల్స్ కూడా ఉన్నాయి. వాటి ధరలు రూ. 2000 నుంచి 3000 వరకు ఉండవచ్చు.
ఆశ్రమాలు: కొన్ని ఆశ్రమాల్లో కూడా బస చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా, సంఘం రోడ్ లో ఉన్న అవధూత ఆశ్రమం చాలా బాగుంటుందని చెబుతారు. వారి ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడి, చిరునామాలు సాధారణంగా ఆన్లైన్లో లభిస్తాయి.
ప్రధాన దత్తాత్రేయ స్వామి ఆలయం (నిర్గుణ పాదుకా మఠం):
కళేశ్వర ఆలయం నుంచి కేవలం అర కిలోమీటరు దూరంలోనే ఈ ప్రధాన దత్తాత్రేయ స్వామి ఆలయం (నిర్గుణ పాదుకా మఠం) ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి ఇది సుమారు 250 మీటర్ల దూరంలో ఉండటంతో, నడుచుకుంటూ సులభంగా వెళ్ళొచ్చు. బస్ స్టాండ్ నుంచి కుడి వైపు కొంచెం ముందుకు వస్తే, దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళడానికి ఒక ఆర్చీ కనిపిస్తుంది. ఇది కేవలం ఒక సాధారణ ఆలయం కాదు; ఇది శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు జీవించిన మఠం. కాలక్రమేణా ఇదే ఆలయంగా మారింది. ఇక్కడ స్వామివారి విగ్రహం బదులు, ఆయన శ్రీ గురు పాదాలనే ప్రధానంగా పూజిస్తారు.
శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు మొదట సంగమ ప్రదేశంలోనే తపస్సు చేసుకుంటూ, తన శిష్యులతో కలిసి ఉండేవారు. రోజువారీ భిక్ష కోసం సంగమం నుంచి గ్రామానికి వచ్చేవారు. శ్రీ గురువు మహిమలను, గొప్పతనాన్ని అర్థం చేసుకున్న గ్రామ పెద్దలు, ఆయనకు ఆశ్రమాన్ని నిర్మించి గ్రామంలోనే ఉండమని వేడుకున్నారు. వారి విన్నపాన్ని మన్నించిన స్వామి, గ్రామ ప్రజలు ఆశ్రమాన్ని నిర్మించాక సంగమం నుంచి ఈ ప్రదేశానికి చేరుకున్నారు. ఈ స్థలంలో ఒక వృక్షంపై బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడని చెబుతారు. శ్రీ గురువును సంగమం నుంచి పల్లకీలో తీసుకువస్తుండగా, ఆ రాక్షసుడు పల్లకీ పైకి దూకాడట. స్వామివారు అతనికి పూర్వజన్మ స్మృతిని కలుగజేసి, మోక్షాన్ని ప్రసాదించారు. అందుకే, దయ్యం పట్టినవారు, మానసిక సమస్యలతో బాధపడేవారు, లేదా భయాలతో ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే నయమవుతుందని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఇలాంటి సమస్యలతో ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తారు. ఈ ఆలయానికి వస్తే మనలోని ప్రతికూల శక్తి తగ్గిపోయి, ఇక్కడి పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మానసిక ప్రశాంతత, సానుకూల ఆలోచనలు కలుగుతాయని చెబుతారు.
శ్రీ దత్తాత్రేయ స్వామి మరియు గానగాపూర్ క్షేత్ర చరిత్ర:
గానగాపూర్ క్షేత్రం దత్తాత్రేయుడి రెండో అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి జీవితంతో విడదీయరాని బంధాన్ని కలిగి ఉంది. దీన్ని కేవలం దత్తాత్రేయ ఆలయం అనడం కంటే, దత్తావతార క్షేత్రం అని పిలవడమే సరైనది. ఎందుకంటే ఇక్కడ నిర్గుణ పాదుకల రూపంలో కొలువై, భక్తులను అనుగ్రహిస్తున్నది స్వయంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామివారే అని భక్తులు దృఢంగా నమ్ముతారు.
జననం మరియు బాల్యం: శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు 1378 వ సంవత్సరం, పుష్యశుద్ధ విదియనాడు, మాధవ శర్మ, అంబా భవానీ దంపతులకు మహారాష్ట్రలోని కారంజలా అనే ప్రదేశంలో జన్మించారు. ఇప్పటికీ ఆయన ఇంటిని దర్శించుకోవచ్చు. ఆయన అసలు పేరు నరహరి. నరహరి ఏడేళ్ల వయసు వచ్చేవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదట, కేవలం సైగలతో మాత్రమే సమాధానం చెప్పేవారట. ఏడేళ్ల వయసులో ఒడుగు (ఉపనయనం) నిర్వహించిన సమయంలో మొదటిసారిగా గాయత్రీ మంత్రాన్ని పటించారు, మరియు “భవతి భిక్షాందేహి” అంటూ తల్లితో మొదటిసారి మాట్లాడారు. అప్పుడే వేదాలను అనర్గళంగా చెప్పి, తాను సామాన్య బాలుడు కాదని, అవతార పురుషుడని తల్లిదండ్రులకు అర్థమైంది.
సన్యాసం మరియు దేశాటన: ఎనిమిదేళ్ల ప్రాయంలో నరహరి కాషాయాన్ని ధరించి, తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకొని సన్యాస దీక్షను అవలంబించేందుకు దేశాటనకు బయలుదేరారు. అలా ప్రయాణించి, రెండేళ్లకు కాశీ క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ గొప్ప యోగి అయిన శ్రీ శ్రీకృష్ణ సరస్వతిని కలుసుకున్నారు. శ్రీకృష్ణ సరస్వతిని తన గురువుగా స్వీకరించి, ఆయన ద్వారా సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి, శ్రీ నృసింహ సరస్వతిగా పేరు మార్చబడ్డారు. ఆ తరువాత అనేక దివ్య క్షేత్రాలను సందర్శించారు.
కారంజలాకు తిరిగి రాక మరియు ఔదుంబర క్షేత్రం: 31 సంవత్సరాల తర్వాత, శ్రీ నృసింహ సరస్వతి తన జన్మస్థలమైన కారంజలాకు తిరిగి వచ్చారు. తన తల్లిదండ్రులతో పాటు పరివారాన్ని అనుగ్రహించి, మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు సమీపంలో ఉన్న ఔదుంబర క్షేత్రానికి చేరుకున్నారు. ఔదుంబరం అంటే మేడి చెట్టు. ఈ క్షేత్రంలో మేడి చెట్టు కింద ఒక సంవత్సరం పాటు చాతుర్మాస దీక్ష చేశారట. ఇక్కడే భువనేశ్వరి దేవి ఆలయం ఉంది. ఔదుంబర క్షేత్రంలోనే నృసింహ సరస్వతి వారు భువనేశ్వరి దేవి ఆజ్ఞ మేరకు మందబుద్ధి గల బాలుడికి జ్ఞానాన్ని అనుగ్రహించారు.
నర్సోబావాడిలో నివాసం: ఔదుంబర క్షేత్రం నుంచి నృసింహ సరస్వతి వారు నర్సోబావాడి చేరుకున్నారు, ఇది ఔదుంబర క్షేత్రానికి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రంలో స్వామి వారు 12 ఏళ్ల పాటు నివసించారు. ఇక్కడ మరణించిన బాలుడిని బతికించి ఓ భక్తురాలి గర్భశోకాన్ని తీర్చారు.
గానగాపూర్ ప్రవేశం మరియు అవతార సమాప్తి: నరసోబావాడిలో 12 ఏళ్ళు నివసించాక, నృసింహ సరస్వతి వారు గానగాపూర్ లోని భీమ అమరజ సంగమ ప్రదేశానికి చేరుకున్నారు. ఈ క్షేత్రంలోనే ఎన్నో మహిమలు చూపారు. గానగాపూర్ లో 23 ఏళ్ళు అనేక మహత్యాలు చూపిన శ్రీ నరసింహ సరస్వతి, 1459 వ సంవత్సరం మాఘ బహుళ పాడ్యమి రోజున గానగాపూర్ లో తన నిర్గుణ పాదుకలను విడిచిపెట్టి, తన నలుగురు శిష్యబృందంతో శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు. ఆ భక్తులు చూస్తుండగానే, ఓ పూల పడవలో కూర్చొని పాతాళ గంగ నుంచి కృష్ణా నదిలో ప్రయాణించి, కదలివనం సమీపంలో అంతర్ధానం అయ్యారు. అలా తన అవతార సమాప్తిని గావించారు. శ్రీ నృసింహ సరస్వతిని సేవించి తరించిన ఆయన శిష్యులు, స్వామి వారి లీలలను గ్రంథస్థం చేసి గురు చరిత్రగా ఈ లోకానికి అందించారు.
శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి మహిమలు మరియు లీలలు:
గానగాపూర్ క్షేత్రంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు అనేక మహిమలు చూపారు. అవి కొన్ని:
- ఒట్టిపోయిన గేదెకు పాలు వచ్చేలా చేయడం.
- త్రివిక్రమ భారతి అనే సాధువుకు వేలాది యోగుల రూపంలో దర్శనం ఇవ్వడం.
- విద్యావంతులైన పండితులకు ఓ పామరుడి ద్వారా జ్ఞానోదయం కలిగించడం.
- మరణించిన భర్తకు ప్రాణం పోసి ఓ భక్తురాలి సౌభాగ్యాన్ని పునరుద్ధరించారు. ఈ సంఘటన మహాసతి కట్ట వద్ద జరిగింది.
- భాస్కర శర్మ అనే భక్తుడి చేత పిడికెడు బియ్యంతో ఊరందరికీ అన్న సందర్పణ చేయించారు.
- గంగాంబ అనే 60 ఏళ్ల పండు ముసలికి సంతాన భాగ్యాన్ని కలిగించారు.
- ఎండు పుల్లను మేడి చెట్టుగా చిగురింప చేశారు. ఈ సంఘటన ఔదుంబర వృక్షం వద్ద జరిగింది.
- నరహరి శర్మ అనే భక్తుడి కుష్టు రోగాన్ని పోగొట్టారు.
- నంది శర్మ అనే భక్తుడికి అమరజా నదిలో స్నానం చేయించి అతడి సమస్త రోగాలను పోగొట్టారు.
- ధన త్రయోదశి రోజున ఒకే రోజు ఒకే సమయంలో ఏడు గ్రామాలకు వెళ్లి భిక్షను స్వీకరించారు.
- పర్వతేశుడు అనే భక్తుడి బీడు పొలంలో ధాన్యపు సిరులు కురిపించారు. ఈ సంఘటన విశ్రాంతి కట్ట వద్ద జరిగింది.
- ఒక ముస్లిం రాజుకు తానే శ్రీపాద వల్లభుడు అని నిరూపించి పూర్వజన్మ స్మృతిని కలుగజేశారు.
ఇలా చెప్పుకుంటూ పోతే, ఆయన లీలలు అనేకం.
గానగాపూర్ లో దర్శించవలసిన ప్రదేశాలు:
గానగాపూర్ లో దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శించే ముందు, భీమ అమరజ సంగమానికి వెళ్లడం ఆనవాయితీ. అష్టతీర్థాలు దర్శించాలనుకునే వారు సంగమం దర్శించాక అష్టతీర్థాలు దర్శించి, చివరగా దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శిస్తారు.
భీమ అమరజా సంగమం: గానగాపూర్ బస్ స్టాండ్ నుంచి సంగమ ప్రదేశం సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షేర్ ఆటోలు లభిస్తాయి లేదా ఆటో మాట్లాడుకోవచ్చు (ఐదు, ఆరు మంది ప్రయాణించగలిగే పెద్ద ఆటోకు రూ. 1100 చార్జ్ చేస్తారు). ఈ ప్రదేశంలో భీమ మరియు అమరజ నదుల సంగమం ఉంటుంది. ఈ సంగమం గంగా, యమునా, సరస్వతి సంగమించే ప్రయాగ సంగమంతో సమానంగా చెబుతారు. ఈ సంగమంలో స్నానం ఆచరిస్తే ప్రయాగలో స్నానం ఆచరించిన ఫలితం లభిస్తుందని నమ్ముతారు.
అమరజా నది విశిష్టత: సాధారణంగా నదులు దక్షిణవాహినిగా ప్రవహిస్తాయి, కానీ కాశీలో గంగా నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. అలాగే, గానగాపూర్ క్షేత్రంలో అమరజా నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు దేవతల సైన్యాన్ని అంతటిని చంపేశాడు. అప్పుడు ఇంద్రుడు మహాశివుని మొరపెట్టుకోగా, మహాశివుడు ఒక పాత్రలో నీరు ఇచ్చి, ఆ నీటిని చనిపోయిన దేవతలపై చల్లమన్నారు. ఇంద్రుడు అలా చల్లే క్రమంలో పొరపాటున ఆ నీరు చేజారి కిందపడి ఒక నదిగా ప్రవహించింది, అదే అమరజా నది. ఈ కారణం చేతనే నృసింహ సరస్వతి స్వామి వారు చివరిగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నారు.
స్నానం: వర్షాలు పడిన తర్వాత (ముఖ్యంగా అక్టోబర్ నుంచి మార్చి) ఈ నదిలో పుష్కలంగా నీరు ఉంటుంది, అప్పుడు సంగమ స్నానం చేయవచ్చు. లేని సమయంలో నీటిని తలపై చల్లుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. సంగమ ప్రదేశంలోనే రెండు తీర్థాలు ఉంటాయి. సంగమం దర్శించాక, ఇక్కడ ఉన్న రావి చెట్టు వద్ద దత్తాత్రేయ స్వామి మరియు శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఈ ప్రదేశంలోనే నృసింహ సరస్వతి వారు శిష్యులకు ప్రవచనం చెప్పేవారట.
ఔదుంబర వృక్షం: రావి వృక్షం పక్కనే ఔదుంబర వృక్షం ఉంది. మహిమ: ఒకసారి హరి అనే బ్రాహ్మణుడు కుష్టు వ్యాధితో బాధపడుతూ శ్రీ గురువు వద్దకు వచ్చి ప్రార్థించాడు. అప్పుడు శ్రీ గురువు అతనికి ఔదుంబర వృక్షం యొక్క ఎండు పుల్లను ఇచ్చి, సంగమ ప్రదేశానికి వెళ్లి సంగమానికి తూర్పు దిక్కున నది ఒడ్డున నాటమన్నారు. సంగమంలో స్నానం చేసి ఆ పుల్లకు నీళ్లు పోసి పూజించమన్నారు. అవి పచ్చని ఆకులు మొలకెత్తినప్పుడు అతని పాపాలు నశించి కుష్టు వ్యాధి నుంచి విముక్తి పొందుతాడని చెప్పారు. శ్రీ గురువు ఆదేశానుసారం నరహరి ఆచరించడంతో, ఎండు పుల్లలు చిగురించాయి మరియు అతని రోగం నయమైంది. ఔదుంబర వృక్షాన్ని సేవించి, ఇక్కడ గురు చరిత్ర పారాయణం చేసిన వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ పూజా సామాగ్రి సమర్పించి, దీపారాధన చేసుకొని, కొబ్బరికాయ కొట్టవచ్చు.
సంగమ దత్తాత్రేయ స్వామి ఆలయం (సంగమంలోనిది): ఔదుంబర వృక్షం నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే ఈ ఆలయం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారు నరసోబావాడి నుంచి గానగాపూర్ వచ్చినప్పుడు సంగమ ప్రదేశంలో మొట్టమొదటిగా అనుష్టానం చేసి నివసించిన ప్రదేశం ఇది. ఇక్కడ స్వామి వారు త్రిమూర్తి రూపంలో దత్తాత్రేయ అవతారంలో దర్శనం ఇస్తారు.
నృసింహ తీర్థం: సంగమ దత్తాత్రేయ స్వామి ఆలయానికి ఎదురుగా, నదిలోకి వెళ్ళడానికి మెట్ల మార్గం కనిపిస్తుంది. ఈ మెట్లు దిగి కిందకి వెళితే ఆ ప్రదేశంలోనే నృసింహ తీర్థం ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ కూడా నీరు ఉండదు.
సంగమేశ్వర ఆలయం: నృసింహ తీర్థంలో స్నానం చేసి, సంగమ దత్తాత్రేయ స్వామి ఆలయం వెనకాలకు వెళితే సంగమేశ్వర ఆలయం ఉంటుంది. నృసింహ తీర్థంలో స్నానం చేసి ఈ సంగమేశ్వరుని దర్శించుకుంటే శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఫలితం లభిస్తుందని చెబుతారు.
అష్టతీర్థాలు:
భీమ నది ఒడ్డున స్వామి వారు ఎనిమిది తీర్థాలను ఏర్పాటు చేశారు. ఒక్కో తీర్థంలో స్నానం చేస్తే ఒక్కో అభిష్టాన్ని నెరవేరుతుందని చెబుతారు. ప్రతి తీర్థంలో గురు పాదుకలు, శివలింగాన్ని స్థాపించారు. తీర్థంలో స్నానం చేసి, ఆ తీర్థంలోని నీటిని శివలింగానికి అభిషేకం చేయాలి.
షట్కుల తీర్థం: ఇది అష్టతీర్థాల్లో మొదటిది, సంగమ ప్రదేశమే షట్కుల తీర్థంగా కూడా చెబుతారు.
విశ్రాంతి కట్ట: సంగమం నుంచి తిరిగి వచ్చేటప్పుడు, నృసింహ సరస్వతి స్వామి వారు గ్రామం నుంచి సంగమానికి వెళ్ళే మార్గంలో ఈ ప్రదేశంలో కొంత సమయం విశ్రాంతి తీసుకునేవారట. అందుకే దీన్ని విశ్రాంతి కట్ట అని పిలుస్తారు. ఇక్కడ శివలింగం, స్వామి వారి పాదుకలు ఉన్నాయి. పర్వతేశుడు అనే భక్తుడి బీడు పొలంలో స్వామి వారు ధాన్యపు సిరులు కురిపించిన సంఘటన జరిగిన ప్రదేశం కూడా ఇదే.
భాగీరథి తీర్థం (వారణాసి తీర్థం): విశ్రాంతి కట్ట నుంచి కొంచెం ముందుకు వెళితే భాగీరథి తీర్థం ఉంటుంది. దీనిని వారణాసి తీర్థం అని కూడా పిలుస్తారు. నృసింహ సరస్వతి స్వామి వారి కంటే ముందు, గోస్వామి అనే మహాపురుషుడు, పరమ శివ భక్తుడు ఈ ప్రదేశంలో నిత్యం పరమేశ్వరుని ధ్యానంలో ఉండేవారు. ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తనని పిచ్చివాడి గా చూసేవారట. ఒకసారి తన సోదరులు కాశీకి వెళ్తూ తనని కూడా పిలిచారట. అప్పుడు ఆయన “ఈ ప్రదేశానికి మించిన కాశీ ఉందా? ఈ తీర్థానికి మించిన గంగ ఉందా?” అని అనడంతో వారికి కోపం వచ్చి, “ఇది కాశీ అంటున్నావు కదా, మరి విశ్వేశ్వరుని చూపించు” అని అడిగారట. అప్పుడు ఆయన ఈ ప్రదేశంలో నిలబడి ఆకాశం వైపు చూస్తూ “వ్యోమకేశ నీ దర్శనాన్ని అనుగ్రహించు” అని పరమేశ్వరున్ని కోరుకున్నాడట. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇక్కడ లింగ రూపంలో వెలిసాడట, అదే సమయంలో ఈ తీర్థంలో మణికర్ణికను కూడా సృష్టించాడట. అందుకే దీనిని వారణాసి తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థంలో స్నానం చేసి శివలింగానికి అభిషేకం చేసుకుంటే కాశీ విశ్వేశ్వరుని దర్శించిన ఫలితం లభిస్తుంది.
పాప వినాశిని తీర్థం: భాగీరథి తీర్థం నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే పాప వినాశిని తీర్థం ఉంటుంది. నృసింహ సరస్వతి స్వామి వారి సోదరికి కుష్టు వ్యాధి సోకడంతో, ఆమె స్వామి వారిని కలిసి తన బాధ చెప్పుకుంది. తాను పూర్వజన్మలో తెలియక పిల్లులను చంపడం వల్ల కుష్టు వ్యాధి వచ్చిందని తెలియజేసి, ఈ తీర్థంలో స్నానం ఆచరించమని చెప్పారట. ఆమె మూడు రోజులు ఈ తీర్థంలో స్నానం చేశాక తన కుష్టు వ్యాధి పోయిందట. ఆ తరువాత ఆమె ఇక్కడే ఆశ్రమాన్ని ఏర్పరచుకొని తన జీవితకాలం సేవ చేస్తూ జీవించారు. ఈ తీర్థంలో స్నానం చేసి శివలింగానికి అభిషేకం చేసుకుంటే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని స్వామి వారు చెప్పారట.
కోటి తీర్థం: పాప వినాశిని తీర్థం నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే కోటి తీర్థం ఉంటుంది. ఈ కోటి తీర్థంలో స్నానం ఆచరిస్తే, జంబూ ద్వీపంలో (మన అఖండ భారతదేశంలో) ఉన్న పుణ్య తీర్థాలన్నిటిలో స్నానం చేసిన ఫలితం లభిస్తుందట.
రుద్రపాద తీర్థం: కోటి తీర్థానికి అతి సమీపంలోనే రుద్రపాద తీర్థం ఉంటుంది. ఈ తీర్థంలో స్నానం చేసి పితృ దేవతలకు పిండ ప్రధానం చేస్తే గయా క్షేత్రంలో పిండ ప్రధానం చేసిన ఫలితం లభిస్తుందట. పిండ ప్రధానం చేయని వారు, దోసిట్లో నీటిని తీసుకొని, మూడు తరాల పితృ దేవతలను తలచుకొని తర్పణం వదలాలట.
మహాసతి కట్ట: రుద్రపాద తీర్థం నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే మహాసతి కట్ట ఉంటుంది. శ్రీ గురువు మరణించిన భర్తకు ప్రాణం పోసి, ఓ భక్తురాలి సౌభాగ్యాన్ని పునరుద్ధరించిన సంఘటన జరిగిన ప్రదేశం ఇది.
చక్ర తీర్థం: మహాసతి కట్ట నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే చక్ర తీర్థం ఉంటుంది. ఈ చక్రతీర్థంలో స్నానం ఆచరించి చక్రేశ్వర స్వామిని దర్శిస్తే ద్వారక దర్శన ఫలితం లభిస్తుందట. ఎవరైతే మందబుద్ధి, మానసిక సమస్యలతో బాధపడతారో, వారు ఈ తీర్థంలో స్నానం చేసి చక్రేశ్వర స్వామిని దర్శించుకుంటే జ్ఞానం మరియు మానసిక ప్రశాంతత లభిస్తుందట.
మన్మధ తీర్థం: చక్ర తీర్థం నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే మన్మధ తీర్థం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఒక్క తీర్థంలోనే నీరు అందుబాటులో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసి, కళేశ్వర స్వామిని దర్శిస్తే గోకర్ణ తీర్థంలో స్నానం చేసి మహాబలేశ్వరుని దర్శించుకున్న ఫలితం లభిస్తుందట.
ఇతర ముఖ్యమైన ప్రదేశాలు:
పరశురాముని ఆలయం:
భస్మకొండ నుంచి కొంచెం ముందుకు వెళితే వైట్ మార్బుల్ తో కనిపిస్తున్న దత్తాత్రేయ స్వామి ఆలయం వెనుక చెట్టు కింద పరశురాముని ఆలయం ఉంటుంది. పూర్వకాలంలో పరశురాముడు ఈ ప్రదేశంలో పెద్ద యాగం చేశారట. అందుకే ఇప్పటికీ ప్రజలు ఇక్కడ మట్టిని సేకరించి ఇంటికి తీసుకువెళుతున్నారు.
కళేశ్వర స్వామి ఆలయం:
మన్మధ తీర్థం నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే కళేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ముందుగా పంచముఖ గజానన మరియు నవగ్రహాలయం దర్శించుకోవచ్చు. ఆ ఆలయం వెనుకకు వెళితే శనీశ్వరాలయం ఉంటుంది. శనీశ్వరాలయం దర్శించుకొని ముందుకు వస్తే కళేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయం గోకర్ణ క్షేత్రంలోని మహాబలేశ్వర ఆలయంతో సమానంగా చెబుతారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.