Gudimallam temple history in telugu: భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఆలయాలలో ఒకటిగా, రెండు వేల సంవత్సరాలకు పైగా చెక్కు చెదరకుండా నిలిచి ఉన్న గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం (Gudimallam Parasurameswara Temple), తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో, రేణిగుంట విమానాశ్రయం నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ చరిత్ర ఏదో సినిమాలో చూపించిన అద్భుతంలా అనిపిస్తుంది, కానీ ఇది భారత పురాతత్వ శాస్త్రవేత్తలు వారి పరిశోధనలలో కనుగొన్న నిజం.
అరుదైన శివలింగం:
గుడిమల్లం ఆలయంలోని శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష లింగాన్ని పోలి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, శివలింగం అంటే స్త్రీ పురుషుల మర్మాంగాలు అని, అందులో పానపట్టం స్త్రీ పురుషాంగం అయితే, శివలింగం పురుషుని మర్మాంగం అని నమ్ముతారు. ఈ లింగం ఐదు అడుగుల ఎత్తులో నిటారుగా నిలబడి ఉంటుంది. ఈ విగ్రహం నిటారుగా ఉన్న పురుషాంగం మీద శివ రూపాన్ని చెక్కినట్లు ఉంటుంది. ఈ విగ్రహంలో మంగోల్ లక్షణాలు కనిపిస్తాయని, తలకు జటాచూటంతో జటాభార రూపంతో శివుడు కనిపిస్తాడు. చెవులకు లోలాకులు కర్ణాభరణాలుగా ఉంటాయి. యజ్ఞోపవితం లేకపోవడం ఒక వింతగా ఉంటుంది. ఈయన లింగోద్భవ సమయ మహాశివుడని నమ్మకం. ఈ లింగానికి కుడి చేతిలో జింక (కొంతమంది మేక అని చెబుతారు), మరొక చేతిలో నీటి కుండ, ఎడమ భుజంపై పరశువు (గొడ్డలి) ఉంటాయి. పరశువు కలిగి ఉండటం వల్ల ఈ దేవునికి పరశుత్తముడు అనే పేరు వచ్చింది. ఈ విగ్రహం నవపాషాణ శివలింగం అని, గోధుమ రంగులో ఉంటుందని చెబుతారు. ఉజ్జయినిలో లభించిన క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దానికి చెందిన రాగి నాణాలపై ఈ లింగాన్ని పోలిన బొమ్మలు ఉన్నాయని గుర్తించారు. క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలోనే ఈ శివలింగం ప్రతిష్టించబడినట్లు ఆధారాలు ఉన్నాయి. 1911లో శ్రీ గోపీనాథ రావు అనే పురాతత్వవేత్త ఒక ఏడాది పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి తెలియజేశారు.
పరశురాముని పురాణ గాథ:
ఈ ఆలయం పురాణాల ప్రకారం, పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించి, ఆ తరువాత తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బతికించుకున్నప్పటికీ, మాతృహత్యా మహాపాపంతో బాధపడ్డాడు. ఈ పాపం నుండి విమోచనం పొందడానికి, కొన్ని ఋషుల సలహా మేరకు శివుని ఆరాధించడానికి అడవిలోకి బయలుదేరి, చివరకు ఈ అద్భుతమైన శివలింగాన్ని చూసి మైమరచిపోతాడు. అతను ఆ ప్రాంతంలో ఒక కొలను ఏర్పాటు చేసుకుని, దాని ఒడ్డున తపస్సు చేసేవాడు. ప్రతిరోజూ ఆ కొలనులో ఒకే ఒక పుష్పం పూసేది, దాన్ని పరశురాముడు శివునికి సమర్పించేవాడు. ఆ పుష్పాన్ని రక్షించడానికి చిత్రసేనుడు అనే యక్షుడిని కాపలాగా నియమిస్తాడు, అందుకు బదులుగా అతనికి ప్రతిరోజు ఒక జంతువును బలిగా ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఒక రోజు ఒక అదృశ్య రాక్షసుడు ఆ పువ్వుని తుంచి శివునికి పూజ చేయగా, పరశురాముడు ఆ రాక్షసుడితో భీకర యుద్ధం చేస్తాడు. చివరకు శివుడు ప్రత్యక్షమై వారిని శాంతింపజేసి, ఇద్దరి భక్తికి మెచ్చి వారికి ముక్తిని ప్రసాదించాడని చెబుతారు. ఈ కారణంగా ఈ ఆలయాన్ని పరశురామేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు.
ఆలయ నిర్మాణం మరియు చరిత్ర:
ఈ ఆలయం మొదట్లో బహిరంగ ప్రదేశంలో ప్రతిష్టించబడిన లింగం చుట్టూ కొయ్యల పందిరిని ఏర్పాటు చేశారని చెబుతారు. ఒకటవ శతాబ్దంలో ఈ లింగం చుట్టూ ఇటుకరాళ్లతో రాజపృష్టాకారం (ఏనుగు వెనుక నుండి చూసినట్లు)లో ఆలయాన్ని నిర్మించారు. తవ్వకాల్లో బయటపడిన 12 వరుసల శాతవాహన కాలం నాటి ఇటుక రాతి గోడ దీనికి సాక్ష్యం అని కార్తికేయ శర్మ పేర్కొన్నారు. మూడవ శతాబ్దం వరకు ఇటుకరాతి ఆలయంగా ఉన్న ఈ శివాలయం, తొమ్మిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు వివిధ రాజులచే మార్పులు చేయబడింది. పల్లవులు మరియు విజయనగరపు రాజులు ఈ ఆలయానికి ఎన్నో దానాలు, కానుకలు ఇచ్చినట్లు ఆలయంలోని శాసనాలు చెబుతున్నాయి.
ఆలయ విశిష్టతలు మరియు అద్భుతాలు:
ఈ ఆలయంలోని నిర్మాణం ఆగమ శాస్త్రానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మూల విగ్రహానికి ఎదురుగా తూర్పున ధ్వజస్తంభం, బలిపీఠం, పడమర వైపు సింహద్వారం ఉంటాయి. ఇక్కడ శివలింగమే కాదు, ఆలయ నిర్మాణం కూడా ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఈ ఆలయంలో నృత్య గణపతి, కుమారస్వామి, సూర్య భగవానుడు, దుర్గమ్మ వారి విగ్రహాలు ఉంటాయి. కుమారస్వామి ఆరు ముఖాలతో, వెనక్కి తిరిగి ఉన్న నెమలిపై ఉండటం విశేషం. ఇక్కడి సూర్య విగ్రహాన్ని భారతదేశంలోనే తొలి సూర్య విగ్రహంగా చెబుతుంటారు.
ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరును చిత్రాల బావి అంటారు. ఈ కోనేరులో స్వామి కోసం రోజుకొక పువ్వు పూస్తుంది, అది కమలం లేదా పద్మం కావచ్చు. వింత ఏమిటంటే, ఒకసారి పూసిన రకం మళ్ళీ సంవత్సరం అయితే గాని పూయదు. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి గర్భాలయం మొత్తం నీటిలో మునిగిపోతుందని, పరమేశ్వరుడు పూర్తిగా నీటిలో మునిగిపోతాడని చెబుతారు. ఇది గంగాదేవి శివుడిని పూర్తిగా ఆలింగనం చేసుకున్నట్లుగా ఇక్కడి ప్రజలు నమ్ముతారు. రెండు మూడు రోజుల తర్వాత నీళ్లన్నీ ఇంకిపోతాయి. కొంతమంది స్వర్ణముఖి నది వరదలు వచ్చినప్పుడు కూడా ఇలా అవుతుందని అంటుంటారు.
ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా తిరుమలలోని విగ్రహంలాగే ఉంటుందని, చాలా మంది తిరుమల వెంకటేశ్వరుని విగ్రహం, గుడిమల్లంలోని ఈ విగ్రహం ఒకటేనని చెబుతుంటారు. ఈ ఆలయం నుండి శ్రీకాళహస్తిలోని శివాలయానికి రహస్య స్వరంగ మార్గం ఉందని, అప్పట్లో కాళహస్తి నుండి గుడిమల్లం ఆలయానికి వచ్చి పూజలు చేసి, తిరిగి అదే స్వరంగ మార్గం గుండా వెళ్ళిపోయేవారని ఇప్పటికీ చెబుతుంటారు.
ఆలయంలోని శిలలను డోలరైట్ అంటారు. ఈ డోలరైట్ 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల వద్ద రూపొందిందని చెబుతారు. కొంతమంది వీటిని మెటియారైడ్ అని కూడా అంటుంటారు, అంటే తోకచుక్కలు భూమిని ఢీకొన్నప్పుడు ఇవి ఏర్పడి ఉంటాయని చెబుతారు. గుడిమల్లం గర్భగుడిలో 15 సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మరణించినా, అంతటి భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ ఈ విగ్రహానికి ఏమీ జరగలేదని చెబుతారు.
సంతానం లేనివారు ఈ గుడి ప్రాంగణంలో రాత్రి గడిపేవారని, ఆ తరువాత పిల్లలు పుడితే గుడి మల్లేశ్వరుడు అని, గుడి మల్లేశ్వరమ్మ అని పేర్లు పెట్టుకునేవారని చెబుతారు. ఉత్తరాయణం, దక్షిణాయనం సమయంలో సూర్యకిరణాలు స్వామివారిపై పడటం కూడా ఇక్కడ ఒక విశేషం. ముఖ్యంగా జూన్ 9, 10, 11 తేదీలలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి మూలవిరాట్ పై పడతాయి.
ఈ ఆలయాన్ని మొదట ‘గుడిపల్లం’ అని పిలిచేవారు, ఎందుకంటే గుడి ఎత్తులో ఉన్నప్పటికీ, లోపల శివలింగం భూమి మట్టానికన్నా 10 అడుగుల పల్లంలో ఉంటుంది. కాలక్రమేణా అదే ‘గుడిమల్లం’గా మారిందని చెబుతారు. పల్లవులు నిర్మించారు కాబట్టి గుడిపల్లం అని పిలిచి, కాలక్రమేణా గుడిమల్లంగా మారిందని కూడా అంటుంటారు.
ఇటువంటి అరుదైన ఎన్నో వింతలు, విశేషాలు కలిగిన ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించాలని సూచిస్తారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
